కాంగ్రెస్ కార్యకర్త  ప్రెస్​మీట్​లా ఉంది..గవర్నర్​ ప్రసంగం ఆయన స్థాయికి తగ్గట్టు లేదు: కేటీఆర్​

కాంగ్రెస్ కార్యకర్త  ప్రెస్​మీట్​లా ఉంది..గవర్నర్​ ప్రసంగం ఆయన స్థాయికి తగ్గట్టు లేదు: కేటీఆర్​
  • చావులో డప్పుకొట్టినట్టుగాప్రసంగం ఉంది
  • గవర్నర్​నూ కాంగ్రెస్​ సర్కారుమోసం చేసింది
  • ప్రభుత్వానికి విజన్​ లేదు.. అంతటా20% కమీషన్ నడుస్తున్నదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని, గాంధీభవన్​లో కాంగ్రెస్​ కార్యకర్త  ప్రెస్​మీట్​లా ఉందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్​ సర్కారు గవర్నర్​తో అబద్ధాలు, అర్ధసత్యాలను చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని విమర్శించారు. గవర్నర్​ ప్రసంగం పెండ్లి, చావులో డప్పు కొట్టినట్టు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్​నూ మోసం చేసిందన్నారు.

బుధవారం అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్​లో మాట్లాడారు. ప్రభుత్వానికి విజన్​ లేదని, 20 శాతం కమీషన్ పై నడుస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్ర సచివాలయంలోనూ జరగని ఘోర సంఘటన ఇక్కడి సచివాలయంలో జరిగిందని, 20 శాతం కమీషన్​ లేకుంటే బిల్లులు ఇవ్వట్లేదంటూ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్​ ముందే ధర్నా చేశారని అన్నారు.

కాంగ్రెస్​ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రసంగంలో స్పష్టతనిస్తారని ఆశించినా అలాంటిదేమీ జరగలేదన్నారు. కాంగ్రెస్​ సర్కారు వైఫల్యంతో రైతులు అరిగోసపడుతున్నారని, 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా గవర్నర్​ ప్రసంగంలో ఆ కుటుంబాలకు భరోసానిచ్చే ఒక్క మాట కూడా లేదన్నారు. రుణమాఫీ ఎక్కడా 25 నుంచి 30 శాతం కూడా పూర్తికాలేదని, దానిపైనా అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.

రైతుబంధు సాయం అందకముందే, రైతులకు, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పించారన్నారు. కేసీఆర్​పై గుడ్డిద్వేషంతో మేడిగడ్డ బ్యారేజీని 15 నెలల నుంచి రిపేర్​ చేయకుండా ఎండబెట్టడంతో గోదావరి బేసిన్​లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రేవంత్  చేతగానితనంతో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు పొలాల్లో గొర్లు, బర్లు మేపుతున్నారని అన్నారు. కులగణన పేరుతో బీసీలను మోసం చేశారన్నారు. దానిని ప్రశ్నించిన కాంగ్రెస్​ ఎమ్మెల్సీని సస్పెండ్​ చేశారని విమర్శించారు.